కుడియా తెల్లరాయి క్వారీ సీజ్‌

29 Jun, 2018 13:48 IST|Sakshi
తెల్లరాయి క్వారీ

రిజర్వ్‌ ఫారెస్టులో అక్రమంగా నిర్వహిస్తున్నట్టు నిర్ధారణ

ముగ్గురు క్వారీ నిర్వాహకులపై కేసు నమోదు

దేవరాపల్లి(మాడుగుల): అనంతగిరి మండలం పరిధిలో గల కుడియా తెల్ల రాతి క్వారీని అటవీ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ శాఖ సెక్షన్‌లోని తట్టపూ డి బీట్‌ పరిధిలో గల రిజర్వడ్‌ ఫారెస్టులో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నట్టు నిర్ధారించుకుని సీజ్‌ చేశామని చోడవరం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీజర్‌ రామనరేష్‌ బిర్లంగి, తెనుగుపూడి సెక్షన్‌ అటవీశాఖ అధికారి ఎం. రమేష్‌కుమార్‌ గురువారం తెలిపా రు. అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న దొమ్మంగి పెంటం నాయుడు, మహేంద్ర వీరకుమార్, సందీప్‌ కార్తీకేయ అనే  ముగ్గురు వ్యక్తులపై  కేసులు నమోదు చేయడంతో పాటు క్వారీ ప్రాంగణంలో ఉన్న జేసీబీ, డ్రిల్లింగ్‌ మిషన్‌  కూడా సీజ్‌ చేశామని  తెలిపారు. దీనికి సంబంధించి రామనరేష్‌  తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా తెనుగుపూడి అటవీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఎం.రమేష్‌ కుమార్, తట్టపూడి బీట్‌ ఆఫీసర్‌ పి. శంకరాచారి కలిసి అటవీ ప్రాంత పరిశీలనకు వెళ్లారు. పక్కనే ఉన్న  కుడియాలోని సర్వే నంబర్‌ 4 లో గల  క్వారీని కూడా గత ఏడాది  ఏప్రిల్‌ 10న పరిశీలించారు. 

క్వారీ ఏర్పాటు చేసిన స్థలంపై సందేహం కలిగిన   అటవీశాఖ స్థానిక అధికారులు జీపీఎస్‌(గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌) పాయింట్‌ ద్వారా పరిశీలించి, రిజర్వ ఫారెస్టులో ఉన్నట్టు గుర్తించారు. ఆ  క్వారీకి 2002 నుంచి 2022 వరకు రెవెన్యూ, మైన్స్‌ అండ్‌ జియాలాజికల్‌ అనుమతులున్నాయి. అటవీ శాఖ నుంచి ఎటువంటి అనమతులు లేనందున  క్వారీని నిలిపి వేయడంతో పాటు క్వారీలో ఉన్న జేసీబీ డ్రిల్లింగ్‌ మిషన్ల గత ఏడాది ఏప్రిల్‌ 19న స్వాధీనం చేసుకున్నామన్నారు.   క్వారీ నిర్వహించే ప్రాంతం ఫారెస్టు శాఖది కాదని, రెవెన్యూకు సంబంధించినదంటూ  కలెక్టర్‌తో పాటు జిల్లా అటవీశాఖ అధికారులకు అప్పట్లో క్వారీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఏడాది తరువాత దీనిపై విచారణ జరిపేందుకు విశాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ దుర్గా ప్రసాద్‌  దర్యాప్తు అధికారిగా  నియమించారు. ఆ క్వారీ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉందని నిర్ధారిస్తూ అటవీ, రెవెన్యూశాఖ అధికారులు సంయుక్తంగా ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ఈ నెల 25న మేరకు క్వారీ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతో పాటు జేసీబీ, డ్రిల్లింగ్‌ మిషన్లను సీజ్‌ చేసినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు