ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

7 Nov, 2019 04:50 IST|Sakshi

అటెండెన్స్ తగ్గడంతో డిటెండైన విద్యార్థి

కేపీహెచ్‌బీకాలనీ: కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ (బీటెక్‌)లో పి.సందీప్‌ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతీయేడు సెమిస్టర్‌ పరీక్షల నేపథ్యంలో 75శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులను మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.

ఇందులో భాగంగా అటెండెన్స్ తక్కువగా ఉన్న విద్యార్థులను డిటెండ్‌ లిస్టులో చేర్చారు.  సందీప్‌ 55శాతం అటెండెన్స్ తో డిటెండ్‌ అయ్యాడు. తన అటెండెన్స్ ను పెంచాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులపై అతను ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో బుధవారం మరికొందరు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులతో కలసి ప్రిన్సిపల్‌ సాయిబాబారెడ్డి చాంబర్‌కు వెళ్లి అటెండెన్స్్స పెంచి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరాడు. అందుకు ప్రిన్సిపాల్‌ నిరాకరించడంతో విద్యార్థులతో ఆందోళనకు దిగాడు.  ఆందోళనకు దిగిన సందీప్‌ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకోవడంతో తోటి విద్యార్థులు అడ్డుకున్నారు.

అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకొని క్యాంపస్‌ హెల్త్‌ సెంటర్‌కు తీసుకువెళ్లి పరీక్షల అనంతరం పోలీస్‌స్టేష కు తరలించారు. సెమిస్టర్‌ పరీక్షలకు ముందు డిటెండైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామని, వెబ్‌సైట్‌లోనూ పెడతామని దీంట్లో మార్పుచేర్పులకు తావులేదని ప్రిన్సిపాల్‌ సాయిబాబారెడ్డి తెలిపారు. గత నెలలో కొందరు సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌లను ర్యాగింగ్‌ చేయడంతో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశానని, ఆ సంఘటనను మనసులో పెట్టుకొని తనపై కావాలనే కుట్రచేసి డిటెండ్‌ చేశారని సందీప్‌ ఆరోపించాడు.

మరిన్ని వార్తలు