కూర రాజన్నే సూత్రధారి

30 Dec, 2017 12:04 IST|Sakshi
షేర్‌ మధు వద్ద స్వాధీనం చేసుకున్న బోర్‌ తుపాకినీ చూపిస్తున్న ఎస్పీ

సీపీబాట ఏర్పాటులో ఆయనే కీలకం

దళాలకు 27 ఆయుధాలు సరఫరా చేసిన రాజన్న

సాక్షి, మహబూబాబాద్‌: ఆరు నెలల క్రితం ఆవిర్భవించిన చండ్రపుల్లారెడ్డి (సీపీ)బాట అజ్ఞాత దళం ఏర్పాటులో జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న కీలకమని మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు గుర్తించారు. ఈ దళానికి 27 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు పలువురిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌ జిల్లాలకు చెందిన 11 మంది 2016, సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌కు వెళ్లి కూర రాజన్నను కలిశారని, ఆ సమయంలో ఆయా జిల్లాల పరిధిలో సీపీబాట పేరుతో దళాన్ని ఏర్పాటు చేయాలని, ఆయుధాలు సరఫరా చేస్తానని రాజన్న చెప్పినట్లు విచారణలో మధు వెల్లడించాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 18న 27 తుపాకులు, మందుగుండు సామగ్రిని పంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు మరికొంత మందిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు