‘నా చావుకు ఎవరూ కారణం కాదు’  

27 Dec, 2019 13:33 IST|Sakshi

ముంబై : నటుడు కుశాల్‌ పంజాబీ బలవన్మరణానికి పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడి మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని కుశాల్‌ లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. అదే విధంగా తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కుమారుడికి సమానంగా పంచాలని కోరాడు. కాగా కుశాల్‌ పంజాబీ హఠాన్మరణం చెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కుశాల్‌ స్నేహితుడు, నటుడు కరణ్‌వీర్‌ బోహ్రా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో సెలబ్రిటీలు అతడి మృతికి సంతాపం తెలిపారు. అయితే ప్రస్తుతం కుశాల్‌ ఆత్మహత్య విషయం తెలిసి వారంతా షాక్‌కు గురవుతున్నారు. (టీవీ నటుడి హఠాన్మరణం.. )

ఇక రియాలిటీ షో జోర్‌ కా జట్కాలో విజేతగా నిలిచిన కుశాల్‌ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. ఫర్హాన్‌ అక్తర్‌ లక్ష్యా, కరణ్‌ జోహార్‌ కాల్‌ సినిమాలతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. కాగా కుశాల్‌ మృతిపై ప్రముఖ గాయకుడు బాబా సెహగల్‌ విచారం వ్యక్తం చేశాడు. ‘కుశాల్‌ లేడంటే నమ్మలేకపోతున్నాను. సవాళ్లను ఎదుర్కునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తను ఓ మంచి తండ్రి. నా తమ్ముడి వంటి నీ ఆత్మకు శాంతి చేకూరాలి కుశాల్‌’ అని ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు