సిటీలో లేడీ దొంగల ముఠా

28 Jun, 2018 11:31 IST|Sakshi
సీసీ.కెమెరాలో కిలాడీ యువతి

సీసీ కెమెరాలో చిక్కిన తతంగం

జయనగర: టిప్‌టాప్‌గా దుస్తులు ధిరించిన ఒక యువతి తన అనుచరులతో కలిసి నగరంలో ఇళ్లను లూటీ చేస్తోంది. సీసీ కెమెరాలో దొరికిన చిత్రాల ఆధారంగా పోలీసులు కిలేడీ కోసం వెతుకున్నారు. వివరాలు... జయనగర 5 వ బ్లాక్‌ 9 వ మెయిన్‌రోడ్డులోని రాజారామ్‌ సిల్క్‌ యజమాని మురళీకృష్ణ కుటుంబం నివాసముంటుంది. ఈ నెల 22 తేదీ ఉదయం 11.30 సమయంలో ఇంటికి తాళం వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు తిరిగిరాగా, ఇంటి డోర్‌లాక్‌ బద్దలు కొట్టడానికి యత్నించినట్లు కనబడింది.  తక్షణం ఇంటి వద్ద ఉన్న సీసీకెమెరా పరిశీలించగా దొంగలు చోరీకి యత్నించిన దృశ్యాలు కనిపించాయి.

యువతి రెక్కీ..
మధ్యాహ్నం 2.30 సమయంలో జీన్స్‌ప్యాంట్, టీషర్ట్‌ ధరించి తలకు చున్నీ కట్టుకుని వచ్చిన యువతి ఇంటి కాలింగ్‌ బెల్‌ నొక్కింది. అనంతరం  కిటికీలో నుంచి గమనించి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అని గమనించింది. అనంతరం చుట్టుపక్కన రాతి బెంచీ పై కూర్చుని ఎవరైనా వస్తున్నారా అని వేచిచూసిన అనంతరం మొబైల్‌లో తన అనుచరులకు సమాచారం అందించింది. కొంతసేపటికి బ్యాక్‌ప్యాక్‌ వేసుకుని టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి, మరొకరు ఇంటి కాంపౌండ్‌లోకి ప్రవేశించారు. బ్యాగ్‌ నుంచి సుత్తి, ఇనుప కడ్డీ తీసి ఇంటి తాళం పగులగొట్టడానికి యత్నించారు. ఈ సమయంలో సీసీ కెమెరాను గమనించిన దుండగులు మరో పక్కకు తిరిగారు. చివరికి చోరీ చేయకుండా ముఠా వెనుదిరిగింది.

ఎన్నెన్ని చోరీలు చేసిందో
గేట్‌ వద్ద అమర్చిన సీసీ కెమెరా పరిశీలించగా దొంగలు కారులో వచ్చి ఇంటి గేట్‌ ముందు కారు నిలిపిన దృశ్యాలు ఉన్నాయి. ఇంటి యజమాని మురళీకృష్ణ జయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని లేడీగ్యాంగ్‌ కోసం అన్వేషిస్తున్నారు. సీసీ కెమెరాలో మహిళ ముఖం స్పష్టంగా నిక్షిప్తమైంది. ఈ ముఠా నగరంలో ఎన్ని చోరీలు చేసిందా? అని ఖాకీలు కూపీ లాగుతున్నారు. 

మరిన్ని వార్తలు