కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు;20 మంది మృతి

31 Aug, 2019 12:00 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో సుమారుగా 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలపాలు కాగా 70 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ధూలే జిల్లాలోని వాఘాది గ్రామంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం సిలిండర్‌ పేలింది. దీంతో ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు.

కాగా ప్రమాద సమయంలో అక్కడ సుమారు వంద మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం చెల్లాచెదురుగా పడి ఉన్న ఎనిమిది మృతదేహాలను వెలికితీశామని, మిగతా వాటి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు సహాయక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు