‘ఆమె రక్తం కావాలి.. ఓపికను పరీక్షిస్తోంది’

1 May, 2018 11:01 IST|Sakshi
లెక్చరర్‌ దీపా నిశాంత్‌

తిరువనంతపురం, కేరళ : కేరళలోని త్రిచూర్‌కు చెందిన ఓ మహిళా లెక్చరర్‌ తనకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపా నిశాంత్‌ త్రిచూర్‌లోని శ్రీ కేరళ వర్మ కాలేజ్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కొందరు బీజేపీ కార్యకర్తలు ఆమెను చంపుతామంటూ ఫేస్‌బుక్‌ వేదికగా బెదిరించారు. తనను బెదిరించిన వారిని త్వరగా అరెస్టు చేయాలని దీపా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కోరారు.

కేరళ బీజేపీ నాయకుడు, ఇంటెలెక్చువల్‌ వింగ్‌ అధ్యక్షుడు టీజీ మోహన్‌దాస్‌ తన నంబర్‌ను సోషల్‌మీడియాలో పోస్టు చేశారని, అప్పటినుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని దీపా ఫిర్యాదులో పేర్కొన్నారు. బహ్రయిన్‌లో ఉంటున్న రమేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి ‘ఆమె రక్తం కావాలి.. ఓపికను పరీక్షిస్తోంది’ అంటూ సోషల్‌మీడియాలో దీపాను ఉద్దేశించి పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ‘మేం అందుకే ప్రయత్నిస్తున్నాం’  అంటూ ఇంటెలెక్చువల్‌ వింగ్‌లో పని చేసే బిజు నాయర్‌ అనే వ్యక్తి రమేశ్‌ పోస్టుకు కామెంట్‌ చేశాడు. కాగా, దీపా ఫిర్యాదుపై స్పందించేందుకు టీజీ మోహన్‌ దాస్‌ నిరాకరించారు.  

మరిన్ని వార్తలు