కలిసి బతకనివ్వట్లేదు.. ఇక వచ్చే జన్మలోనే...

12 Jun, 2018 13:22 IST|Sakshi
లెస్బియన్‌ జంట ప్రతీకాత్మక చిత్రం.. ఇన్‌సెట్‌లో సూసైడ్‌ నోట్‌

‘కలిసి బతికేందుకే ఈ లోకాన్ని విడిచిపోతున్నాం. మాకు ఏ మగతోడు లేదు. ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చి దగ్గరయ్యాం. కానీ,  ఆ సమాజం మమల్ని ఒక్కటిగా బతకనివ్వట్లేదు. అందుకే కలిసి చావాలనుకుంటున్నాం. బహుశా ఇక మేం ఒకటిగా బతికేది వచ్చే జన్మలోనే’... అంటూ సూసైడ్‌ నోట్‌ రాసిన ఓ లెస్బియన్‌ జంట పసిపాపతోసహా సబర్మతీ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.  

అహ్మదాబాద్‌: పోలీసుల కథనం ప్రకారం.. బావ్లా పట్టణానికి చెందిన ఆశా(30) తన ఇద్దరు పిల్లలతో, అదే ప్రాంతంలో భావన(28) అనే మరో మహిళ తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. భర్తలు దూరం కావటంతో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ వీరిద్దరూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. గత ఏడు నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ... త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. 

అయితే కుల పెద్దలు మాత్రం వీరి సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో భావన, ఆశా తన కూతురు మేఘాను తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఊరి నుంచి వెళ్లిపోయారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ అనూహ్యాంగా నదిలో శవాలై కొట్టుకొచ్చారు. 

పోలీసుల కథనం ప్రకారం... సోమవారం సబర్మతి నదీ తీరంలో ఓ మహిళ మృత దేహాం కొట్టుకువచ్చిందని గుజారీ బజార్‌ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ మృత దేహాన్ని వెలికి తీసే క్రమంలో మరో మహిళ మృత దేహాం కూడా బయటపడింది. ఆ రెండు దేహాలు కట్టేసి ఉన్నాయి. కాస్త దూరంలో ఒడ్డున కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారిని గుర్తించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నదీ తీరం వెంబడి ఉన్న గోడపై లిప్‌ స్టిక్‌తో సూసైడ్‌ నోట్‌ రాసింది. కాస్త దూరంలో కూడా ఓ పేపర్‌ ప్లేట్‌పై తమ ఆవేదనను వెల్లగక్కుతూ మరో నోట్‌ రాశారు. అక్కడికి కాస్త దూరంలో దొరికిన బ్యాగులో ఆధార్‌ కార్డుల ఆధారంగా మృతులను గుర్తించి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. జూన్‌ 8వ తేదీన వారు ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు బంధువులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు