ప్రాణం తీసిన వాటర్‌హీటర్‌

4 Mar, 2018 16:38 IST|Sakshi
మృతురాలు జల(26) (ఫైల్‌ ఫోటో)

నీటిపాత్రకు విద్యుత్‌ ప్రసరణ

అక్కడికక్కడే వివాహిత మృతి

ధర్మపురి: వాటర్‌ హీటర్‌ ఓ వివాహిత ప్రాణం తీసింది. పెళ్లయిన తర్వాత కూడా చదువుకొనసాగిస్తున్న ఆమె బీఈడీ పరీక్షలు రాసేందుకు సన్నద్ధమైంది. శనివారం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. స్నానానికి వేడినీళ్ల కోసం వాటర్‌హీట్‌ పెట్టుకోగా నీటికి విద్యుత్‌ సరఫరా కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఎస్సై మధుకర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన నగేశ్‌– జల(26) దంపతులకు నాలుగేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు శ్రీనిధి, అశ్విని ఉన్నారు.

ఉపాధ్యాయురాలు కావాల న్న ఆశయంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ చదువుతోంది. జల భర్త నగేశ్‌ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం దుబయ్‌ వెళ్లాడు. ఈ క్రమంలో బీఈడీ పరీక్షల శనివారం నుంచి ప్రారంభమయ్యా యి. పరీక్షలకు సిద్ధమైన జల పరీక్ష రాసేందుకు వెళ్లేందుకు స్నానానికి వేడినీళ్ల కోసం ఇత్తడి పాత్రలో వాటర్‌హీటర్‌ పెట్టుకుంది. ఈ క్రమంలో వాటర్‌హీటర్‌కు ఉన్న తీగ బయటకు వచ్చి పాత్రకు తగిలింది. పాత్రను తాకుతూ కొద్ది దూరంలో ఉన్న నీటికి కూడా విద్యుత్‌ సరఫరా అయింది.

అటుగా వచ్చిన జల నీటిలో అడుగుపెట్టడంతో షాక్‌కుగురై అక్కడికక్కడే మృతిచెందింది. ఏం జరిగిందో తెలియక జల ఇద్దరు కూతుళ్లు అమ్మా అంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుబాయ్‌ వెళ్లిన భర్త నగేశ్‌కు జల మరణ వార్త అందించారు. వెంటనే అతడు స్వగ్రామానికి బయల్దేరాడు.  
 

మరిన్ని వార్తలు