టీవీ యాంకర్‌కు జీవితఖైదు

20 Dec, 2017 17:41 IST|Sakshi

న్యూఢిల్లీ: 17 ఏళ్ల కిందట భార్యను హతమార్చిన ప్రముఖ టీవీ యాంకర్‌ సుహైబ్‌ ఇల్యాసికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒకప్పుడు పాపులర్‌ అయిన 'ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌' టీవీ క్రైమ్‌ షోకు సుహైబ్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. సుహైబ్‌ భార్య అంజు ఇల్యాసి 2000 సంవత్సరం జనవరి 11న కత్తిపోట్లతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు విడిచింది. మొదట ఆమెది ఆత్మహత్యగా భావించారు.

కానీ అంజు తల్లి, సోదరి ఆమెది ఆత్మహత్య కాదని, భర్త ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. కట్నం కోసం అంజును నిత్యం సుహైబ్‌ వేధించేవాడని తెలిపారు. ఈ ఆరోపణలను సుహైబ్‌ తిరస్కరించారు. అతనిపై విచారణకు మొదట ట్రయల్‌ కోర్టు నిరాకరించగా.. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో విచారణ మలుపు తిరిగింది. భార్య అంజు చనిపోయిన సమయంలో 'మోస్ట్‌ వాంటెడ్‌ షో' హోస్ట్‌గా, నిర్మాతగా సుహైబ్‌ టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు.

మరిన్ని వార్తలు