అదనంగా ఒక్క రూపాయి ఇవ్వనన్నాడని..

30 Oct, 2019 09:30 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : జిల్లాలోని గూడూరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రవి అనే వ్యక్తి గాయపడటంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి కారణమైన బాలుపై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. వివరాలు.. మంగళవారం రాత్రి రవి మద్యం కొనేందుకు దుకాణం వద్దకు వెళ్లాడు. ఈ క్రమం బ్రాందీ సీసాను కొనుగోలు చేసి ఎమ్మార్పీ ప్రకారం 120 రూపాయలు చెల్లించాడు. అయితే ఎమ్మార్పీపై పది రూపాయలు అదనంగా ఇవ్వాలని మద్యం దుకాణం సిబ్బంది రవిని డిమాండ్‌ చేశారు. తాను అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించనని రవి తేల్చి చెప్పాడు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సహనం కోల్పోయిన దుకాణ సిబ్బంది రవిపై మద్యం సీసాతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కాగా విషయం గమనించిన స్థానికులు రవిని ఆస్పత్రితో చేర్పించగా.. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు