కోల్కతా : నాలుగో దశ లోక్సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఎంసీ, బీజేపీ, వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు వారిని చెదరగొట్టాయి. కేంద్ర మంత్రి, అసన్సోల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బబుల్ సుప్రియో కారుపై కొంతమంది టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కేంద్ర భద్రతా బలగాలతో రక్షణ కల్పించని కారణంగా అసన్సోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు.
దీనిపై స్పందించిన బబుల్ సుప్రియో.. పశ్చిమ బెంగాల్ ఓటర్లు చైతన్య వంతులయ్యారని, కేంద్ర భద్రతా బలగాలు లేనిదే ఓటు వెయ్యమని చెప్పటం శుభసూచకమని పేర్కొన్నారు. భద్రతా బలగాలు లేని చోటుకు తాను స్వయంగా కే్ంద్ర బలగాలను తీసుకువెళతానని చెప్పారు. ఓటర్ల చైతన్యాన్ని చూసి మమతా బెనర్జీ భయపడుతోందని అన్నారు.