భార్యను చంపిన భర్తపై లుకౌట్‌ నోటీసులు జారీ

7 Dec, 2019 11:44 IST|Sakshi
సరబ్‌జీత్‌ కౌర్‌ (ఫైల్‌ ఫోటో)

చండీఘడ్‌ : ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న భార్యను స్కూల్‌ ఆవరణ బయట హత్య చేసిన కేసులో భర్తపై చండీఘడ్‌ పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సరబ్‌జీత్‌ కౌర్‌, హర్విందర్‌ సింగ్‌లు భార్యాభర్తలు. హర్విందర్‌ ఏపనీ చేయకుండా తిరుగుతుండడంతో దంపతుల మధ్య విభేదాలొచ్చాయి. ఈ నేపథ్యంలో భార్య సరబ్‌జీత్‌ ప్రైవేటు టీచర్‌గా పనిచేసుకుంటూ భర్త నుంచి విడిగా ఉంటోంది. దీంతో కక్ష పెంచుకున్న హర్వీందర్‌ ఆమెను స్కూల్‌ ఆవరణ బయట దారుణంగా చంపేశాడు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందే భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని సరబ్‌జీత్‌ ఫిర్యాదు చేసి ఉండడంతో ఆ దిశగా విచారించిన పోలీసులు భర్త హర్వీందర్‌ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా భావించి అతని కోసం వెతకటం ప్రారంభించారు.

అతను ఆజ్ఞాతంలో ఉన్నట్టు తేలడడంతో లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. కాగా, సరబ్‌జీత్‌ ఫోన్‌లో భర్త హర్వీందర్‌ సింగ్‌ ఫోన్‌ నెంబరు కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. దంపతులిద్దరూ విడిగా ఉంటున్నప్పటి నుంచీ కనీసం మాట్లాడుకోలేదని దంపతుల ఉమ్మడి స్నేహితుడొకరు పోలీసులకు తెలిపాడు. మరోవైపు హత్య చేయబడ్డ సరబ్‌జీత్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె బంధువులు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు