సాక్షి, పులివెందుల : పట్టణంలోని కదిరి రింగ్ రోడ్డు సమీపంలోని విజయ్ గార్డెన్ వద్ద బుధవారం ఉదయం ఎద్దుల బండిని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బ్రాహ్మణపల్లెకు చెందిన రైతు సిద్దారెడ్డితోపాటు కాడెద్దులలో ఒక ఎద్దు మృతి చెందగా.. మరో ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన రైతు సిద్దారెడ్డి (65) వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న తన పొలం వద్దకు ఎడ్ల బండిపై వెళుతున్నాడు.
అంబకపల్లె నుంచి కదిరి వైపు వెళుతున్న లారీ ఎడ్లబండిని ఢీకొట్టింది. దీంతో రైతు సిద్దారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఒక ఎద్దు మృతి చెందగా.. మరొక ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయ పనులు చేసుకుంటున్న సిద్దారెడ్డి కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.