పెళ్లికి నిరాకరిస్తారని ప్రేమజంట ఆత‍్మహత్య

17 Feb, 2019 16:15 IST|Sakshi

సాక్షి, మెదక్‌: మతాలు వేరుకావటంతో పెద్దలు పెళ్లికి నిరాకరిస్తారన్న ఆందోళనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన బాలేష్(19) అనే యువకుడు రామాయంపేటలోని ఓ వ్యాపార సంస్థలో పని చేసేవాడు. రామాయంపేట మండలం రాయపూర్ గ్రామానికి మహమ్మద్ ప్రవీణ (19) రామాయంపేటలో టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తుండగా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ విషయం రెండు రోజుల క్రితం బాలేష్‌ ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు అతన్ని పని మానిపించారు.

దీంతో బాలేష్‌, ప్రవీణలు తమ మతాలు వేరుకావటంతో పెద్దలు పెళ్లికి నిరాకరిస్తారని ఆందోళనకు గురయ్యారు. నిన్న ఇంటి నుంచి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. అయితే ఈ ఆదివారం ఝాన్సీ లింగాపూర్ శివారులో బాలేష్ బైక్‌ను గుర్తించిన స్థానికులు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అడవి ప్రాంతంలో గాలించగా బాలేష్, ప్రవీణలు చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు