ప్రేమ కథ విషాదాంతం

21 May, 2018 11:00 IST|Sakshi
మృతిచెందిన కీర్తి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హరీష్‌

పురుగుల మందుతాగిన ప్రేమజంట

ప్రియురాలు మృతి ప్రియుడి పరిస్థితి విషమం

కోడుమూరులో ఘటన

కర్నూలు ,కోడుమూరు రూరల్‌: పెద్దలను ఎదిరించలేక..తమ ప్రేమను చంపుకోలేక ఒక ప్రేమ జంట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం కోడుమూరులో చోటు చేసుకుంది. కోడుమూరుకు చెందిన కురువ బజారి కుమార్తె కీర్తి (20), మండలంలోని కృష్ణాపురానికి చెందిన రాముడు కుమారుడు హరీష్‌(20) పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నారు. వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. విషయం తెలియని తల్లిదండ్రులు కీర్తికి రెండు రోజుల కిందట వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెండ్లి చూపులు నిర్వహించారు.

కల్లూరు మండలం పెద్దపాడులో ఉన్న మేనేమామ ఇంటికి తీసుకెళ్లారు. ప్రియురాలి ద్వారా విషయం తెలుసుకున్న హరీష్‌ ఆదివారం మధ్యాహ్నం పెద్దపాడులో ఉన్న కీర్తిని తీసుకొని ద్విచక్రవాహనంపై కోడుమూరు బయలుదేరాడు. తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరనుకున్నారో ఏమో.. మార్గమధ్యలో ప్యాలకుర్తి తోటల్లో వెంట తెచ్చుకున్న పురుగులమందును ఇద్దరూ తాగి అపస్మారక స్థితిలో కోడుమూరు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రేమజంట కుటుంబ సభ్యులు వారిరువురిని ఓ ప్రైవేట్‌ వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కీర్తి మృతిచెందింది. హరీష్‌ పరిస్థితి విషమంగా ఉంది. కోడుమూరు ఎస్‌ఐ నాగార్జున రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు