వివాహానికి నిరాకరించారని..

24 Feb, 2020 01:27 IST|Sakshi

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ప్రియురాలి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం 

నిజామాబాద్‌అర్బన్‌/ఎడపల్లి: ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బోధన్‌ పట్టణానికి చెందిన నవనీత (19) డిగ్రీ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. అయితే, ఆమె పాఠశాలలో చదువుకునే సమయంలో తనతో పాటే చదివే మోహన్‌ (20)తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. మోహన్‌ కుటుంబం జీవనోపాధి కోసం చాలా రోజుల క్రితమే వలస వెళ్లింది. అయినప్పటికీ వారిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వారు ప్రేమ వివాహం చేసుకోవాలని ఇంట్లో  వారికి  చెప్పగా కుటుంబాలకు చెందిన  పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన నవనీత, మోహన్‌ ఆదివారం అలీసాగర్‌ ఉద్యాన వనానికి చేరుకుని, కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో వారిరువురినీ నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించగా, నవనీత అప్పటికే మృతి చెందింది. మోహన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో వైద్య చికిత్స అందిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు