ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

17 Jan, 2019 11:58 IST|Sakshi

ప్రియురాలు మృతి

ప్రియుడి పరిస్థితి విషమం

తిరువొత్తియూరు: తల్లిదండ్రుల నుంచి ప్రేమకు వ్యతిరేకత రావడంతో ఓ జంట విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. వీరిలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ప్రాణాలకు పోరాడుతున్నాడు. కన్యాకుమారి సౌత్‌ మాడ రథవీధిలోని పోలీసుస్టేషన్‌ సమీపంలో ఒక లాడ్జి ఉంది. గత 14వ తేది ఉదయం 7 గంటల సమయంలో ఈ లాడ్జికి ఓ యువతి, యువకుడు వచ్చారు. కన్యాకుమారిని చూడటానికి వచ్చామని కొన్ని రోజులు ఉండేందుకు గది కావాలని కోరారు. ఆ జంట నుంచి చిరునామా కోసం ఆధార్‌ కార్డులను తీసుకుని గదిని కేటాయించారు. మంగళవారం ఉదయం ప్రేమజంట బయటకు వెళ్లి తిరిగి తరువాత రాత్రి లాడ్జికి చేరుకున్నారు. బుధవారం ఉదయం ఆ జంట ఉంటున్న గది తలుపులు తెరచుకోలేదు.

లోపల నుంచి యువకుడి శబ్దం వినబడుతోంది. ఇది విన్న లాడ్జి మేనేజర్‌ కన్యాకుమారి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లాడ్జికి చేరుకుని ఆ గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడ యువకుడి నోటి నుంచి నురుగు కక్కుతూ ప్రాణాలకు పోరాడుతున్నాడు. అతని వెంట వచ్చిన యువతి విషం తాగి శవంగా పడి ఉంది. ప్రాణాలకు పోరాడుతున్న యువకుడిని వెంటనే అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఆ యువకుడు సతీష్‌ (27) అని ఈరోడ్‌ జిల్లా గోపిశెట్టిపాళయం సమీపం కరుమందూరుకు చెందిన వ్యక్తిగా తెలిసింది. మృతి చెందిన యువతి కార్తిక (24). వీరిద్దరూ గోపిశెట్టి పాళయం కడత్తూరులో బనియన్‌ కంపెనీలో పని చేస్తున్న సమయంలో ప్రేమించుకున్నట్టు తెలిసింది. వీరి ప్రేమకు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు