ప్రేమ వ్యవహారం విషాదాంతం

24 Jan, 2019 11:44 IST|Sakshi

చెన్నై ,టీ.నగర్‌: సేలం సమీపాన ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. సేలం జిల్లా, గెంగవల్లి తొడావూరు ప్రాంతానికి చెందిన దినేష్‌ (20) బీఎస్సీ చదువుతున్నాడు. ఇతను కొన్నేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన సెల్వమణి (20)ను ప్రేమిస్తూ వచ్చాడు. వీరి ప్రేమ విషయం గత నెల ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన దినేష్‌ గత మూడో తేది ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి స్పృహతప్పాడు. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి చికిత్సలు అందిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సెల్వమణి ఇంట్లో ఉన్న ఎలుకల మందు తిని స్పృహతప్పింది. ఆమెను సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్సలు పొందుతూ ఆమె ఈనెల 9న మృతిచెందింది. ఇదిలాఉండగా కోవై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన దినేష్‌ మంగళవారం మృతిచెందాడు. దీనిగురించి గెంగవల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

విద్యార్థి ఆత్మహత్య: చెన్నై, టీ.నగర్‌లోని భవనం మూడో అంతస్తు నుంచి దూకి కళాశాల విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మదురై జిల్లా, మేలూరుకు చెందిన ఇస్మాయిల్‌ కుమారుడు షారుక్‌ఖాన్‌ (19). ఇతను మదురైలోని సెంట్రల్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ కళాశాలలో మూడో ఏడాది చదువుతూ వచ్చాడు. కళాశాల 50వ వార్షికోత్సవం చెన్నైలో జరుగుతోంది. ఇందుకోసం మదురై నుంచి అందరూ మంగళవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. ఆ సమయంలో వారు టీ.నగర్, ప్రశాంత్‌ కాలనీలోగల పేయింగ్‌ గెస్ట్‌ పద్ధతిలో అద్దెకు గది తీసుకుని బసచేశారు. ఇదిలాఉండగా షారుక్‌ఖాన్‌ హఠాత్తుగా భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు