ప్రేమజంట అనుమానాస్పద మృతి

17 Nov, 2018 11:59 IST|Sakshi

కర్ణాటకలోని కావేరి నదిలో శవాలై తేలిన యువతీ, యువకుడు

పరువు హత్యలుగా అనుమానం

క్రిష్ణగిరి జిల్లా, చూడుగొండపల్లి గ్రామంలో ఉద్రిక్తత

హొసూరు(తమిళనాడు): ప్రేమించి పెళ్లి చేసుకున్న వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీ, యువకుడు అనుమానాస్పద స్థితిలో కావేరి నదిలో శవాలై తేలారు. దీన్ని పరువు హత్యగా భావించిన పోలీసులు  ఈ మేరకు విచారణ చేపట్టారు. ఈ ఘటన తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హొసూరులో వెలుగు చూసింది. వివరాలు.. హొసూరు తాలూకా, పలవనపల్లి పంచాయతీలోని చూడుగొండపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు నందీష్‌(25) అదే గ్రామానికి చెందిన శ్రీనివాసన్‌ కుమార్తె స్వాతిలు ప్రేమించుకొన్నారు. నందీష్‌ హొసూరులోని ప్రైవేట్‌ హార్డ్‌వేర్‌ దుకాణంలో పనిచేస్తూ హొసూరులో నివాసముంటున్నారు. స్వాతి బీకాం చదివింది. నందీష్‌ వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వివాహానికి స్వాతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రేమజంట ఈ ఏడాది ఆగస్టు 15న బాగలూరు సమీపంలోని తిమ్మరాయస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుంది. తర్వాత హొసూరులోనే కాపురం పెట్టారు.

మృతిచెందిన స్వాతి
ఈనెల 10వ తేదీ రాత్రి 9 గంటల నుంచి స్వాతి, నందీష్‌లు కనిపించలేదు. దీంతో నందీష్‌ తమ్ముడు శంకర్‌ ఈనెల 14న హొసూరు పట్టణ పోలీసులకు  ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో  కర్ణాటకలోని మండ్య  జిల్లా శివసముద్రం వద్ద కావేరి నదిలో మూడు రోజుల క్రితం నందీష్‌ విగతజీవిగా కనిపించగా బెళకావాడి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించారు. కాగా నందీష్‌ మృతదేహం లభ్యమైన చోటనే  గురువారం స్వాతి విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించి కేసును క్రిష్ణగిరి పోలీసులకు బదిలీ చేశారు. ప్రేమజంటది పరువు హత్యగా అనుమానిస్తూ  క్రిష్ణగిరి పోలీసులు స్వాతి తండ్రి శ్రీనివాస్, పినతండ్రి అశ్వత్థప్పతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ప్రేమజంట అనుమానాస్పద మృతితో  చూడుగొండపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పొలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మండ్యలో ఉన్న నందీష్, స్వాతి మృతదేహాలను హొసూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు