ప్రేమ విఫలమైంది.. బతుకు ఆగమైంది..

12 Feb, 2020 08:06 IST|Sakshi
నాగసుబ్రహ్మణ్యంరెడ్డి (ఫైల్‌)

పెళ్లికి నిరాకరించారని మనస్తాపం    

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బలవన్మరణం

గచ్చిబౌలి: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ గోవర్ధన్‌ రెడ్డి కథనం ప్రకారం.. కృష్ణ జిల్లా గుడివాడకు చెందిన మల్లిరెడ్డి నాగ సుబ్రహ్మణ్యం రెడ్డి (24) ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. గచ్చిబౌలి ఏపీహెచ్‌బీ కాలనీలోని ప్లాట్‌ నంబర్‌ 161లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం నుంచి కుటంబ సభ్యులు ఫోన్‌ చేసినా స్పందించలేదు. సోమవారం ఉదయం కూడా స్పందించకపోవడంతో సాయంత్రం 5 గంటల సమయంలో సోదరి, బావ, మామ కలిసి అతడు నివాసముంటున్న చోటికి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. పిలిచినా పలకకపోవడంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.

తలుపులు విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. ఓ యువతిని ప్రేమించగా ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో విడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ విఫలం కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డానని, దీనిపై దర్యాప్తు చేయవద్దని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని సూసైడ్‌నోట్‌లో పేర్కొనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు