ప్రియురాలు మోసం చేసిందన్న ఆవేదనతో..

1 May, 2019 16:08 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ : ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందన్న ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్షల రూపాయలు ఖర్చు చేయించి, పెళ్లికి ఒప్పుకోకపోవటం తట్టుకోలేకపోయిన యువకుడు తనువు చాలించాడని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. యువకుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. అల్వాల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని హరిజన బస్తీలో నివాసం ఉండే సాయి కిరణ్.. స్థానికంగా ఉండే ఓ యువతి గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి కుటుంబసభ్యులు వీరి ప్రేమను  వ్యతిరేకించారు. సదరు యువతితో కలిసి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇరు కుటుంబాలు ఇకపై యువతి, యువకులిద్దరూ కలుసుకోకూడదని  ఒప్పందం చేసుకున్నారు.

కానీ ఆ అమ్మాయి, సాయి ఫోన్‌కు మెసేజ్‌లు పెడుతూ తనను కలవాలని కోరింది. దీంతో ఆ ఇద్దరూ మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసి గడిపారు. ఆ రోజు సాయి ఇంటికొచ్చిన అమ్మాయి అతడి కుటుంబ సభ్యులతో ‘సాయినే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పింది. అలా సాయి బ్యాంకులోని లక్షల రూపాయలు ఖర్చు చేయించిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి తరుపువారి వేధింపులు తట్టుకోలేకనే తమ కుమారుడు మృతిచెందాడని, తమ కుమారుని చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు కోరారు.

మరిన్ని వార్తలు