ఇద్దరి ప్రాణం తీసిన ‘ప్రేమ’

25 Nov, 2018 11:22 IST|Sakshi
జగదీశ్వర్‌ (ఫైల్‌), అంజన్న(ఫైల్‌) 

పురుగుల మందు తాగి ప్రియుడి తండ్రి, ప్రియురాలి అన్న మృతి

ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతున్న యువతి

జహీరాబాద్‌: ఓ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రేమికుల ప్రేమను ఇరుకుటుంబాలు ఆంగీకరించక పొవడంతో గొడవలు నెలకున్నాయి. తమ పరువు పొయిందని అవమానంగా భావించిన ప్రియుడి తండ్రి ప్రియురాలి అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పపడ్డారు. ఝరాసంగం ఎస్‌ఐ. ఏడుకొండలు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మేదపల్లికి చెందిన నాగమణి, మహేశ్‌ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి.

నాగమణికి గత రెండు నెలల క్రితం మొగుడంపల్లి మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. విషయం తెలుసుకున్న నాగమణి ప్రియుడు సదరు యువకుడికి తన ప్రేమ వ్యవహారాన్ని తెలిపాడు. దీంతో ఇరుకుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ విషయమై ఇరుకుటుంబాలు శుక్రవారం రాత్రి వివాదానికి దిగాయి. తమ పరువు పొయిందని భావించిన మహేశ్‌ తండ్రి అంజన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

విషయం తెలుసుకున్న నాగమణి అన్న జగదీశ్వర్‌ సైతం పురుగుల మందు తాగాడు. అనంతరం ఆమె సైతం పురుగుల మందు తాగాడు. ముగ్గురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమికుడి తండ్రి అంజన్న, ప్రేమికురాలి అన్న జగదీశ్వర్‌(25) మృతి చెందారు. నాగమణి చికిత్స పొందుతోంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకుంది. ఈ మేరకు ఎస్‌ఐ. ఏడుకొండలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు