ప్రేమోన్మాది దాడి: రవళి మృతి 

4 Mar, 2019 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ సోమవారం సాయంత్రం కన్నుమూసింది. గత కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంటూ వచ్చింది. పెట్రోల్‌ మంటల్లో శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవటంతో ఊపిరితీసుకోవటం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో వెంటిలేషన్ సహాయంతో డాక్టర్లు కృత్తిమ శ్వాస అందించినప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం రవళి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం పోస్ట్మార్టం జరిగే అవకాశం ఉంది.

అసలేం జరిగింది : రవళి, సాయి అన్వేష్ సంగెం మండలం లోహితలోని కాకతీయ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలో వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. వీరిమధ్య కొనసాగిన ప్రేమ డిగ్రీలోకి వచ్చిన తర్వాత క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో రవళిపై అన్వేష్‌ కోపం పెంచుకున్నాడు. ప్రేమను కొనసాగించాల్సిందేనంటూ రవళిపై ఒత్తిడి తెచ్చాడు. చాలా సార్లు బెదిరించాడు కూడా. అన్వేష్‌ వేధింపులు ఎక్కువవడంతో.. రెండు నెలల క్రితం ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది.

దీంతో రవళి తల్లిదండ్రులు సాయి అన్వేష్‌ తల్లిదండ్రులకు చెప్పి.. వారి గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో అన్వేష్‌ను హెచ్చరించారు. దీంతో తాను ఇకపై రవళి జోలికి వెళ్లనంటూ అన్వేష్‌ లిఖితపూర్వకంగా మాటిచ్చాడు. అయితే తన ఊర్లో పరువు తీసిందనే కారణంతో.. కక్ష పెంచుకున్న అన్వేష్‌.. ఫిబ్రవరి 27న కళాశాల సమీపంలో పెట్రోల్‌తో మాటువేసి దారుణానికి పాల్పడ్డాడు.

సాయశక్తులా ప్రయత్నించాం : యశోద డాక్టర్ల బృందం
పెట్రోల్‌ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవళిని బతికించటానికి సాయశక్తులా ప్రయత్నించామని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రవళికి 70 శాతం లోతైన కాలిన గాయాలయ్యాయని తెలిపారు. శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవటంతో కృత్రిమ శ్వాస అందించామన్నారు. రక్తం తగ్గిపోవటం, రెనల్‌ సట్‌డౌన్‌ (మూత్రపిండాల పనితీరు దెబ్బతినటం), న్యూట్రో ఫెనిక్‌ సెస్పిస్‌తో ఆమె మరణం సంభవించిందని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు