మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య  

11 Aug, 2018 09:11 IST|Sakshi
ప్రభాకర్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు, కుటుంబసభ్యులు 

పెళ్లికి ముందే గర్భం దాల్చిన ప్రియురాలు

పంచాయతీ పెట్టి పెళ్లికి ఒప్పించిన పెద్దలు

పెద్దల సమక్షంలో రోజా తనపై చేయి చేసుకుందని ఆత్మహత్య

కొందుర్గు పర్వతాపూర్‌లో విషాదం

కొందుర్గు రంగారెడ్డి : పంచాయతీలో తనపై ప్రియురాలు చేయి చేసుకుందని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొందుర్గు మండలంలోని పర్వతాపూర్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతాపూర్‌ గ్రామానికి చెందిన ఎడ్ల ప్రభాకర్‌(28), అదే గ్రామానికి చెందిన తుప్పరి రోజా(26) గత కొంతకాలంగా ప్రేమించుకు న్నారు.

పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకున్నారు. ప్రస్తుతం రోజా నాలుగు నెలల గర్భవతి. విషయం తెలిసిన రోజా కుటుంబసభ్యులు, బంధువులు గురువారం పర్వతాపూర్‌ గ్రామంలో పంచాయతీ పెట్టారు. రోజాను పెళ్లిచేసుకోవాలని ప్రభాకర్‌ను ఒప్పించారు. ఇరువురు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆగస్టు 31వ తేదీ వీరి వివాహం జరిపించాలని నిర్ణయించారు.

పంచాయతీ జరుగుతున్న క్రమంలో రోజా ప్రభాకర్‌పై చేయిచేసుకుంది. రోజా తనపై చేయిచేసుకుందని మనస్థాపానికి గురైన ప్రభాకర్‌ శుక్రవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

గమనించిన కటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు