ఎక్స్రే టెక్నీషియన్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, మదనపల్లె క్రైం: ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న మనస్తాపంతో ఎక్స్రే టెక్నీషియన్ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రూరల్ పోలీసులు, బాధితుని కుటుంబసభ్యుల కథనం ఇలా ఉంది.
వేంపల్లె పంచాయతీ దిగువకొనగంట వారిపల్లెకు చెందిన ఆర్.శ్రీరాములు కుమారుడు వెంకటరమణ(24) స్థానిక పుంగనూరు రోడ్డులోని ఓ మిషనరీ ఆసుపత్రిలో ఎక్స్రే టెక్నీషియన్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ఆసుపత్రిలో పనిచేసే ఓ యువతితో మూడేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. యువతిది స్థానిక బసినికొండ కావడంతో తల్లిదండ్రులు ఉన్న ఊరిలోనే కుమార్తెను కులాంతర వివాహం చేసేందుకు నిరాకరించారు.
దీంతో మనస్తాపం చెందిన వెంకటరమణ ఇంటిలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.