ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

16 Mar, 2020 08:09 IST|Sakshi

సాక్షి, చెన్నై: చనువుగా ఉన్న సమయంలో చూసిన బంధువును ఓ జంట హత్య చేసింది. అనంతరం పరారైన వారిద్దరూ జోలార్‌ పేట రైల్వేస్టేషన్‌లో పట్టుబడ్డారు. తమిళనాడులోని శివగంగై జిల్లా ఇడయ మేలూరుకు చెందిన పాండి, మదురై తిరుమాల్‌ తాలుకా చైన్నైమేట్టు తూర్పు వీధికి చెందిన సుబ్బయ్య భార్య లక్ష్మి(32)లతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ ఈనెల 10వ తేదీన ఒక గదిలో చనువుగా ఉండడాన్ని లక్ష్మి బంధువు పేతురాజ్‌(40) చూశాడు. దీంతో ఆగ్రహించిన వారిద్దరూ పేతురాజ్‌ను దారుణంగా హత్య చేసి అక్కడ నుంచి రైల్లో చెన్నైకి పరారయ్యారు. దీనిపై శివగంగై పోలీసులు అన్ని రైల్వేస్టేషన్లకు సమాచారంతో పాటు వారి ఫొటోలను పంపారు.

ఈ నేపథ్యంలో తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట రైల్వే సీఐ వడివు కరసి శనివారం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఆ సమయంలో చెన్నై నుంచి బెంగళూరు వెళుతున్న మైసూరు ఎక్స్‌ప్రెస్‌లో నిందితులిద్దరూ వెళుతున్నట్లు సమాచారం అందింది. దీంతో జోలార్‌పేట రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపి వేసి వారి కోసం గాలించారు. ఆ సమయంలో రైలులో ప్రయాణం చేస్తున్న లక్ష్మి, పాండిలను అరెస్ట్‌ చేసి శివగంగై పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే శివగంగై పోలీసులు జోలార్‌పేట రైల్వేస్టేషన్‌కు చేరుకొని నిందితులను తమ అదుపులోకి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

>
మరిన్ని వార్తలు