జీవితాంతం కలిసుందామనుకున్నారు కానీ..

17 Nov, 2019 09:31 IST|Sakshi

కథలాపూర్‌లో ప్రేమజంట ఆత్మహత్య 

ఇద్దరు డిగ్రీ విద్యార్థులే రాజారాం తండాలో విషాదం

సాక్షి, కథలాపూర్‌(వేములవాడ): జీవితాంతం కలిసి ఉండలేక ఒక్కటిగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం కథలాపూర్‌ మండలంలో చోటుచేసుకుంది. యువతికి ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం కావడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పూనుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు. కథలాపూర్‌ మండలం రాజారాం తండాలో భూక్యా బుల్లి–తిరుపతి దంపతుల కూతురు భూక్యా శిరీష(18), అదే గ్రామానికి చెందిన లకావత్‌ సూర్యనాయక్‌– ప్రమీల దంపతుల కుమారుడు లకావత్‌ మహిపాల్‌(18) పాఠశాల స్థాయి నుంచే ఒకరిపై మరొకరికి ప్రేమ ఏర్పడింది.

శిరీష ప్రస్తుతం కోరుట్లలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా.. మహిపాల్‌ కరీంనగర్‌లోని ఎస్సాఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చుదువుతున్నాడు. వీరి ప్రేమవ్యవహారం పెద్దలకు తెలియడంతో నాలుగునెలలక్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందిన యువకుడితో శిరీషకు నిశ్చితార్థం చేశారు. మరో రెండునెలల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవలే మహిపాల్‌ కరీంనగర్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం వీరిద్దరు గ్రామం నుంచి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం సిరికొండ శివారులోని అటవీప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. సంఘటన స్థలం పక్కనే ఇద్దరి బ్యాగులు, పుస్తకాలు, నోటుబుక్కులు పడేసి ఉన్నాయి. విషయం తెలుసుకున్న మెట్‌పల్లి సీఐ రవికుమార్, కథలాపూర్‌ ఎస్సై రాజప్రమీల సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు