భర్తతో కలసి ఉండలేక.. ప్రియుడితో కలిసి ఆత్మహత్య

22 Mar, 2019 09:14 IST|Sakshi

ప్రేమజంట బలవన్మరణం

భూత్పూర్‌ (దేవరకద్ర): వారిద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.. కానీ తల్లిదండ్రులను ఎదిరించలేక.. వారి మనస్సును బాధపెట్టకూడదని భావించిన ఆ యువతి పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించి తాళి కట్టించుకుంది.. పది నెలల క్రితం వివాహం జరగగా.. రెండు నెలలపాటు వీరి కాపురం సాఫీగా సాగింది. అయితే ప్రేమించిన యువకుడిని మరిచిపోలేక.. ఇద్దరూ కలిసి జీవించలేక.. అర్ధంతరంగా తనువు చాలించారు.. ఈ సంఘటన గురువారం మండలంలోని అన్నాసాగర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కంప్లి మణెమ్మ, నర్సింహల కుమార్తె రామేశ్వరి(25), అదే గ్రామానికి చెందిన నాగరాజు(31) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.

అయితే వీరి ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే మండలంలోని కర్వెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో రామేశ్వరికి తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వివాహామైన రెండు నెలలకే రామేశ్వరి అన్నాసాగర్‌లోని పుట్టింటికి వచ్చింది. రామేశ్వరి ప్రియుడితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో.. భర్తతో కాపురం చేయనని పుట్టింటిలోనే ఉండిపోయింది. కొన్ని నెలలు గడిచిన తర్వాత తల్లిదండ్రులు రామేశ్వరిని మెట్టినింటికి పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు గుర్తించింది.

ఈ క్రమంలో ఆమె బుధవారం రాత్రి ప్రియుడు నాగరాజుతో కలిసి గ్రామ సమీపంలోని మోతుకుంట చెరువు సమీపంలో నబీసాబ్‌ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం వ్యవసాయ పొలాలకు వెళ్లే వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై రామేశ్వరి తండ్రి నర్సింహ భూత్పూర్‌ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాని సీఐ పాండురంగారెడ్డి, ఎస్‌ఐ పర్వతాలు పరిశీలించా రు. ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబ సభ్యు లు, గ్రామస్తులతో ఆరా తీశారు. రామేశ్వరి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు.

మరిన్ని వార్తలు