వైద్యురాలి నిర్లక్ష్యం.. చిన్నారి మృతి

11 Feb, 2019 09:09 IST|Sakshi

సాగర్‌: కాలిన గాయాలతో వచ్చిన చిన్నారికి సకాలంలో చికిత్స అందించకపోగా, వెంటిలేటర్‌ను ఆమె తల్లిదండ్రులే ఏర్పాటు చేసుకోవాలని సూచించిన వైద్యురాలు సస్పెన్షన్‌కు గురైంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు, వైద్యురాలి మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించడంతో అసలు విషయం వెలుగుచూసింది. శుక్రవారం ఉదయం అన్షికా అహిర్వార్‌ అనే ఏడాదిన్నర చిన్నారి వేడి నీటి తొట్టిలో పడిపోవడంతో 70 శాతం శరీరానికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను తల్లిదండ్రులు బుందేల్‌ఖండ్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో చిన్నారి ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. మధ్యాహ్నం సమయంలో అటుగా వచ్చిన డాక్టర్‌ జ్యోతి రౌత్‌.. చిన్నారిని వెంటిలేటర్‌లో ఉంచాలని, ఆసుపత్రిలో ఆ సదుపాయం లేదని తెలిపింది. వారే సొంతంగా వెంటిలేటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీంతో చికిత్స జరగకపోవడంతో ఆ చిన్నారి చనిపోయింది. అయితే ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌ ఉందని, చిన్నారిని అక్కడికి తరలించి చికిత్స అందించాల్సిందని డీన్‌ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌ రౌత్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

మరిన్ని వార్తలు