మాజీ ప్రియురాలిపై యువకుడి ఘాతుకం

12 Feb, 2019 20:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై : మాజీ ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలు... పాల్‌గఢ్‌లో జిల్లాలోని బైసార్‌ గ్రామానికి చెందిన ఫైజల్‌ సైఫీ(23) అనే యువకుడు ప్రేమించాలంటూ గతంలో ఓ యువతి వెంటపడ్డాడు. ఈ క్రమంలో అతడి ప్రేమను అంగీకరించిన సదరు యువతి క్రమేణా సైఫీ ప్రవర్తనలో మార్పు రావడంతో అతడికి దూరంగా ఉంది. దీంతో వారిద్దరు 2017లో విడిపోయారు. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్న సైఫీ.. గతంలో తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు.

కాగా తన బెదిరింపులకు సదరు యువతి లొంగకపోవడంతో తాను చెప్పిన చోటుకు వస్తే ఫొటోలు, వీడియోలను డెలీట్‌ చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో ఆమె ఆదివారం సైఫీతో పాటు బయల్దేరింది. ఈ క్రమంలో ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లిన దుండగుడు.. అక్కడే బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 24 గంటల తర్వాత ఆమెను విడిచిపెట్టడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో పోలీసులు సైఫీని అరెస్టు చేశారు.  
 

మరిన్ని వార్తలు