భర్త రెండో వివాహాన్ని అడ్డుకున్న మలేషియా యువతి

21 Jan, 2019 11:50 IST|Sakshi
మలేషియాలో రాజ్‌కుమార్‌తో దుర్గాదేవిరామీస్‌ పెళ్లి ఫొటో (ఫైల్‌)

చెన్నై , టీ.నగర్‌: ముత్తుపేట సమీపంలో భర్త రెండో వివాహాన్ని మలేషియా యువతి అడ్డుకోవడంతో ఆదివారం సంచలనం ఏర్పడింది. తిరువారూరు జిల్లా, ముత్తుపేట సమీపంలోగల పెరుగవాల్తాన్‌ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ (30) మలేషియాలో ఉద్యోగి. అక్కడ ఒక హోటల్‌లో పనిచేస్తుండగా అదే హోటల్‌లో పనిచేస్తున్న మలేషియాకు చెందిన దుర్గాదేవిరామీస్‌ (25) అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2016లో వివాహం చేసుకున్నారు. ఇలావుండగా సొంతూరికి వెళ్లి వస్తానని తెలిపి రాజ్‌కుమార్‌ 15 రోజుల క్రితం పెరుగవాల్తాన్‌ చేరుకున్నాడు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు అతనికి వేరొక యువతితో వివాహ ఏర్పాట్లు చేశారు.

ఆదివారం ఉదయం అక్కడున్న ఒక మండపంలో వివాహానికి ఏర్పాట్లు జరగసాగాయి. ఈ విషయం తెలుసుకున్న మలేషియా యువతి దుర్గాదేవిరామీస్‌ దిగ్భ్రాంతి చెందారు. దీంతో రెండు రోజుల క్రితం ఆమె పెరుగవాల్తాన్‌కు చేరుకున్నారు. ముత్తుపేట డీఎస్పీ ఇనికోదివ్యన్‌ వద్ద రాజ్‌కుమార్‌కు తనకు జరిగిన వివాహం గురించి పెళ్లిపత్రికతోపాటు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాహాన్ని అడ్డుకోవాల్సిందిగా పోలీసులకు డీఎస్పీ ఆదేశించారు. దీంతో పోలీసులతోపాటు ఆదివారం దుర్గాదేవిరామీస్‌ కల్యాణ మండపం చేరుకున్నారు. అక్కడ ఇరు కుటుంబాల బంధువులు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. రాజ్‌కుమార్, నవ వధువు పరారీలో ఉన్నట్లు కనుగొన్నారు.

మరిన్ని వార్తలు