జాడలేని నిందితుడి ఆచూకీ..!

22 Dec, 2019 10:19 IST|Sakshi
నిందితుడిగా భావిస్తున్న రవి

సాక్షి, పాల్వంచ: భార్యను రోకలితో కొట్టి చంపి పరారైన నిందితుడి జాడ గత నాలుగు నెలలుగా అంతుచిక్కడం లేదు. క్షణికావేశంలో భార్యను హత్య చేసిన క్రమంలో భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక పరారీలోనే ఉన్నాడా అనే సందేహాలకు జవాబు లభించడం లేదు. పట్టణంలోని ఇందిరా కాలనీలో ఒకే వీధికి చెందిన అంబాల రవి, కీర్తి(24)లు ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదు సంవత్సరాల కొడుకు లోకేష్, మూడు సంవత్సరాల కూతురు కాజల్‌ ఉన్నారు. అంబాల రవి కొన్ని రోజులుగా ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు.

దీంతో వీరి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. రవి పని చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతో కుటుంబంలో కలతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌ 14వ తేది రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన రవి ఇంట్లో ఉన్న రోకలితో కీర్తి తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందింది. వెంటనే రవి మోటర్‌ సైకిల్‌పై పరారయ్యాడు. తెల్లారి అతడి మోటర్‌ సైకిల్‌ భధ్రాచలం బ్రిడ్జిపై ప్రత్యక్షమైంది. దీంతో హత్య చేసిన భయంతో రవి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసులకు దొరకకుండా పక్కదోవ పట్టించి పరారీలో ఉన్నాడా అనే సందేహాలకు జవాబు లభించడం లేదు.

గత నాలుగు నెలలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లభించడం లేదు. ఈ విషయమై సీఐ నవీన్‌ను వివరణ కోరగా.. అతని కాల్‌ డాటపై నిఘా ఉంచామని, బంధువులకు కాల్‌ చేస్తున్నాడా అనే కోణంలో కూడా తెలుసుకుంటున్నామని, గోదావరిలో చనిపోయి ఉంటే చెప్పలేమని తెలిపారు.  

మరిన్ని వార్తలు