లాక్‌డౌన్‌ : ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని..

27 Mar, 2020 12:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మంబై : లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తిని అతని సోదరుడే హత్య చేశాడు. ఈ ఘటన ముంబైలోని కందివాలిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ‘రాజేష్‌ లక్ష్మి ఠాకూర్‌ అనే వ్యక్తి తన తమ్ముడు దుర్గేష్‌ను హత్యచేశాడు. బుధవారం మధ్యాహ్నం దుర్గేష్‌​ కిరాణ సామాగ్రి తేవడానికి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత రాత్రిపూట ఇంటికి తిరిగివచ్చిన దుర్గేష్‌పై రాజేష్‌, అతని భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీంతో రాజేష్‌కు, దుర్గేష్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఆ తర్వాత రాజేష్‌ కత్తితో దుర్గేష్‌పై దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డిన దుర్గేష్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దుర్గేష్‌ మృతిచెందాడని వైద్యులు చెప్పారు. దీంతో రాజేష్‌పై హత్య కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నాం’ అని తెలిపారు. దుర్గేష్‌ పుణేలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కరోనా వైరస్‌ ఆందోళనల నేపథ్యంలో అతడు కందివాలిలోని ఇంటికి వచ్చాడు. కాగా, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు