పెళ్లి చేసుకోమంటూ మహిళపై దాడి

25 Sep, 2019 11:04 IST|Sakshi
నిందితుడు అబ్దుల్‌ వాహబ్‌

యాకుత్‌పురా: తనను పెళ్లి చేసుకోమంటూ మహిళను వేధిస్తూ హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని రెయిన్‌బజార్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ అంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్‌ సలాలా బిస్మిల్లా కాలనీ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అసద్, షాహేదా బేగం(35) దంపతులు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ అసద్‌ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అసద్‌ భార్యతో కలిసి చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని అబ్దుల్‌ వాహబ్‌(38) ఇంట్లో అద్దెకుండేవారు. ఇంటి యజమాని అబ్దుల్‌ వాహబ్‌.. షాహేదాబేగంతో సన్నిహితంగా ఉండడంతో పెళ్లి చేసుకోమంటూ వేధింపులు ప్రారంభించాడు. వేధింపులను భరించలేక షాహేదా బేగం ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు.

కాగా, షాహేదా ఈ నెల 23న యాకుత్‌పురా సాదత్‌నగర్‌లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అబ్దుల్‌ వాహబ్‌ మంగళవారం మధ్యాహ్నం ఆ ఇంట్లోకి చొరబడి షాహేదాతో గొడవ పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. అక్కడే ఉన్న మేనత్త అమీరున్నీసా విడిపించేందుకు ప్రయత్నించగా.. ఆమెనూ గాయపడిచాడు. ఇంటి చుట్టుపక్కల వారు రావడంతో వాహబ్‌ అక్కడి పరారయ్యాడు. షాహేదా బేగంను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అబ్దుల్‌ వాహబ్‌ను అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు