స్టార్‌హోటళ్లలో జల్సా చేయాలని!

9 Jul, 2019 07:49 IST|Sakshi
నిందితుడు గౌతం వర్మ , అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ కేఎస్‌ రావు

చోరీల బాటపట్టిన యువకుడు

నిందితుడి అరెస్టు

బంజారాహిల్స్‌:  పుట్టింది మధ్య తరగతి కుటుంబంలో... స్నేహితులు బడా బాబుల కుమారులు కావడంతో వారిలాగే దర్జాగా ఉండాలని, స్టార్‌ హోటళ్లలో మందు, విందులో జల్సాలు చేయాలని, ప్రేమించిన యువతితో షికార్లు చేయాలనుకున్నాడు. తనకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో చోరీల బాటపట్టాడు. తాను పని చేస్తున్న సంస్థలోనే యజమాని కళ్లుగప్పి డబ్బులు తస్కరించి పోలీసులకు చిక్కాడు. సోమవారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ కె.బాలకృష్ణారెడ్డి, డీఐ రమేష్‌తో కలిసి ఏసీపీ కేఎస్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామానికి చెందిన పోతూరి గౌతంవర్మ అలియాస్‌ గౌతం (28) ఐటీఐ చదివాడు.

జీవనోపాధి కోసం నగరానికి వచ్చి వెంకటగిరిలోని హైలం కాలనీలో అద్దెకుంటూ జూబ్లీహిల్స్‌లోని వెజ్‌ టోకిరి రెస్టారెంట్‌లో ఆరు నెలల క్రితం కెప్టెన్‌గా కుదిరాడు. నమ్మకంగా పని చేస్తున్నట్లు నటిస్తూ మే 20న జీతాల కోసం యజమాని తీసుకొచ్చిన రూ. 3 లక్షలు దొంగిలించి పరారయ్యాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక అం శాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేశా రు. గతంలో ఇతగాడు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనం కేసులో పట్టుబడి 5 నెల లు జైలుకెళ్లి వచ్చాడు. అయినా.. తీరు మార్చుకోకపోగా జల్సాలకు అలవాటు పడి మళ్లీ చోరీల బాటపట్టాడు. దొంగిలించిన రూ. 3 లక్షల్లో రూ. 2 లక్షలు వైజాగ్, కాకినాడ, విజయవాడ, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాం తాల్లోని స్టార్‌హోటళ్లలో ఉంటూ ఖర్చు చేశారు. నిందితుడి నుంచి రూ.లక్ష రికవరీ చేశారు. గౌతమ్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు