ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

30 Jul, 2019 17:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫేస్‌బుక్‌ ప్రేమాయణానికి మరో బాలిక మోసపోయింది. ఏకంగా రూ.11 లక్షలు సమర్పించింది. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. స్థానికంగా నివాసముండే ఓ మైనర్‌ బాలికకు రాజమండ్రికి చెందిన హేమంత్‌సాయితో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇదే అదునుగా భావించిన హేమంత్‌సాయి బాలికకు సంబంధించిన ఫొటోలను సేకరించి బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడుతానని హెచ్చరించాడు.

ఇప్పటికే.. ఆమె వద్ద నుంచి రూ.11 లక్షలు వసూలు చేసిన హేమంత్‌.. తాజాగా ఆమె తండ్రిని కూడా రూ.40 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హేమంత్‌సాయి మిత్రులు కూడా.. ఈ ఘటనలో నిందితులుగా ఉన్నట్టు తేలింది. పోలీసులు నిందితులను రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు