టీచర్‌ను వేధిస్తున్న ఆకతాయికి దేహశుద్ధి

27 Jun, 2019 07:33 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు యాకూబ్‌

రాజేంద్రనగర్‌: ఓ ప్రైవేటు పాఠశాల టీచర్‌ను వేధిస్తున్న ఓ ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పర్‌పల్లి ప్రాంతానికి చెందిన యాకూబ్‌(30) న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్‌ టీచర్‌ను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ప్రతి రోజు టీచర్‌ స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చే సమయాల్లో ఆమె వెంట పడి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. రోజు రోజుకు యాకూబ్‌ ప్రవర్తన శృతిమించుతుండడంతో విషయాన్ని టీచర్‌ తన భర్తకు తెలిపింది. బుధవారం ఉదయం టీచర్‌ స్కూల్‌కు కాలినడకన వెళ్తుండగా న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ వద్ద యాకూబ్‌ ఆమె చున్నీ పట్టుకొని లాగాడు. దీంతో టీచర్‌ భర్తతో పాటు స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు