కోల్కతా : అరుదైన రకానికి చెందిన పామును స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో కనిపించే తక్షక్ జాతికి చెందిన ఆ పాము విలువ సుమారు 9 కోట్ల రూపాయలని వెల్లడించారు. వివరాలు...కోల్కతాకు చెందిన ఇషా షేక్ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో తక్షక్ పామును వారికి అమ్మేందుకు 9 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ ప్రకారం జార్ఖండ్కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగును పరిశీలించిగా పాము కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
కాగా పశ్చిమ బెంగాల్లోని కలియాచాక్ అడవుల్లో కనిపించే ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. చూడటానికి బల్లిలా ఉండే తక్షక్ పాముల నుంచి సేకరించిన విషాన్ని పలు రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో ఇవి భారీ ధర పలుకుతాయి.