రూ.2 వేల కోసం బావమరిదిని హత్య

24 May, 2020 11:54 IST|Sakshi
మృతదేహం వద్ద కన్నీరు పెడుతున్న భార్య   

సాక్షి, పెద్దారవీడు: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వక పోవడంతో సొంత బామరిదిని బావ బాణంతో పొడిచి చంపాడు. ఈ సంఘటన మండల కేంద్రం పెద్దారవీడు పంచాయతీ పరిధిలో చెంచుగూడెంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుడుముల చిన్నయ్య వద్ద ఆయన బావమరిది మండ్ల రాజయ్య గతంలో రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు కచ్చితంగా తిరిగి ఇవ్వాలని బావ అడిగాడు. బావమరిది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం ఇద్దరూ మద్యం పూటుగా తాగి ఇంటికి వచ్చి ఘర్షణ పడ్డారు. మాటామాట పెరిగి ఇద్దరూ గొడ్డలితో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. కుడుముల చిన్నయ్య చేతిలోని గొడ్డలి కింద పడిపోయింది.

రాజయ్య గొడ్డలితో చంపుతాడని భయపడి చిన్నయ్య ఇంట్లోకి వెళ్లాడు. వెంటనే బాణం (అంబు) తెచ్చి రాజయ్య (35)ను పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరి గృహాలు ఎదురెదురుగా ఉన్నాయి. రాజయ్య అక్క గుర్రమ్మకు చిన్నయ్యతో వివాహమైంది. మృతుడి భార్య హనుమక్క గర్భిణి కావడంతో కాన్పు కోసం మార్కాపురం మండలం జమ్మనపల్లె పుట్టింటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న మృతుడి భార్య కన్నీరు మున్నీరైంది. మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు కారణాలు బంధువులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఆయన వెంట ట్రైనీ డీఎస్పీ స్రవంతిరాయ్, సీఐ రాఘవేంద్ర ఉన్నారు. వీఆర్వో బద్వీటి మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి.రామకృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు