పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో కుటుంబసభ్యులపై..

19 Oct, 2018 14:45 IST|Sakshi
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

సాక్షి, హైదరాబాద్‌ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కుటుంబసభ్యులపై కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బేగంపేట్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  యాప్రాల్‌కు చెందిన సయ్యద్‌ రెహమాన్‌కు, రసూల్‌ పురాకు చెందిన కౌసర్‌ బేగంకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కౌసర్‌ బేగం బేగంపేట పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది. రెహమాన్‌ మద్యానికి బానిస కావడంతో కౌసర్‌ బేగం భర్తకు దూరంగా ఉంటూ తల్లి ఇంట్లో ఉంటోంది. ఎనిమిది నెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఇటీవల తాగడానికి డబ్బుల కోసం భార్య కౌసర్‌ బేగం వద్దకు వచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బేగం పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కౌసర్‌ బేగం తల్లిదండ్రులు, చెల్లితో కలిసి వచ్చింది. భార్యపై కోపంతో కత్తితో పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశాడు. అడ్డొ చ్చిన కుటుంబసభ్యులను కూడా కత్తితో గాయపర్చాడు. ఈ దాడిలో భార్య కౌశర్‌ బేగం, మరదలు షాకీర్‌ బేగం, అత్త మస్తాన్‌ బేగం, బంధువులు సర్ధార్‌ బేగం, సల్మాన్‌ ఖాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని సంఘటనా స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయపడ్డ వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు