ప్రియురాలిపై కత్తితో దాడి..

9 Sep, 2019 05:06 IST|Sakshi
ప్రియురాలిపై దాడికి పాల్పడిన రాము

ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

ఏడేళ్లుగా సహజీవనం.. అనుమానంతో దారుణం  

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఘటన

చిలకలూరిపేట: ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అనుమానించిన ప్రియుడు ఆమెపై కత్తితో దాడిచేసి హత్య చేయాలని ప్రయత్నించాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లికి చెందిన కాటేపల్లి రాముకు వినుకొండకు చెందిన కరణం లక్ష్మీప్రసన్నతో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఇరువురూ కలిసి తిరుపతిలో ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. రెండేళ్ల కిందట చిలకలూరిపేట పట్టణానికి చేరుకొని సుబ్బయ్యతోటలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాము వంట మాస్టర్‌గా పనిచేస్తుండగా, లక్ష్మీ ప్రసన్న ఓ సూపర్‌ మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తోంది. గత ఐదు నెలలుగా లక్ష్మీ ప్రసన్న వేరొకరితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు రాము అనుమానిస్తూ వచ్చాడు.

సెల్‌ఫోన్‌లో వేరొకరితో మాట్లాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. ఆదివారం లక్ష్మీప్రసన్న వేరొకరితో మోటార్‌ బైక్‌పై రావటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన రాము కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చెయ్యి, నడుము, వెనుక భాగంలో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇరువురినీ 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువురికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు