బాలిక గొంతుకోసిన యువకుడు

9 May, 2020 05:23 IST|Sakshi
నిందితుడు రామాంజనేయులు అరెస్టును చూపుతున్న పోలీçసులు

లైంగిక దాడికి యత్నం.. ప్రతిఘటించడంతో దారుణం

అనంతపురం జిల్లాలో ఘటన

పెద్దవడుగూరు: బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడు ఆమె ప్రతిఘటించడంతో కత్తిపీటతో గొంతు కోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురంలో శుక్రవారం జరిగింది. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాలివీ.. గుత్తిలో 10వ తరగతి చదువుతున్న బాధిత బాలిక లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు రోజూ ఉపాధి హామీ పనులకు వెళ్లిన తర్వాత బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు (18) అనే యువకుడు ఆమెపై కన్నేశాడు.

కొద్దిరోజులుగా వెంటపడి వేధిస్తున్నాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులకు చెబుతానని యువకుడ్ని హెచ్చరించింది. దీంతో కోపం పెంచుకున్న యువకుడు శుక్రవారం ఉదయం బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేస్తూ తీవ్రంగా ప్రతిఘటించటంతో పక్కనే ఉన్న కత్తిపీటతో ఆమె గొంతు కోస్తుండగా.. స్థానికులు చేరుకోవడంతో పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అతడిని గ్రామ శివార్లలో అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు