మామపై కత్తితో అల్లుడి దాడి

13 Sep, 2019 09:56 IST|Sakshi
బాధితుడి వివరాలు సేకరిస్తున్న సీఐ సన్యాసినాయుడు, ఎస్సై అజార్‌ అహ్మద్‌

కొడుకును పోలీసులకు అప్పగించిన తండ్రి

సాక్షి, భామిని (శ్రీకాకుళం): కూతురు కాపురాన్ని చక్కదిద్దడానికి వచ్చిన మామపై అల్లుడు కత్తి దూశాడు. ఈ ఘటన మండలంలో గురువారం కలకలం రేపింది. గాయపరిచిన నిందితుడిని తండ్రే స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించి ఫిర్యాదు చేయడం విశేషం. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి మామ వై చిన్నారావు మండలంలోని బిల్లుమడలోని తన అల్లుడు కే సంతోష్‌కుమార్‌ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కూతురు, అల్లుడు తగాదా విషయమై మాట్లాడుతున్నాడు.

దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు తనకు అందుబాటులో ఉన్న కత్తితో మామపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన నిందితుడు తండ్రి తవిటయ్య నేరుగా బత్తిలి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. అనంతరం గాయపడిన వై చిన్నారావును కొత్తూరు ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్‌ ప్రశాంత్‌ వైద్య సేవలందించి పాలకొండ ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. కొత్తూరు సీఐ ఎల్‌ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో బత్తిలి ఎస్సై అజార్‌ అహ్మద్‌ ఆస్పత్రిలో బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు