కన్నతల్లిపై కొడుకు రాక్షసత్వం

10 Oct, 2017 19:02 IST|Sakshi

మోరెనా(మధ్యప్రదేశ్‌): సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు అంటారు. కానీ మద్యం మత్తులో నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే రక్తం పంచుకు పుట్టిన కొడుకు కాటేశాడు. మానవత్వానికే మాయని మచ్చ ఈ సంఘటన.

తల్లిపై అత్యాచారానికి పాల్పటడంతోపాటు అడ్డుకున్న పాపానికి ఆమెను దారుణంగా చంపాడు. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లా కైలారస్‌ పట్టణంలో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన ఓ యువకుడు(24) మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 5న రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న తల్లి(50)పై అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించటంతో గాయపరిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అనంతరం ఆమె తలపై బండరాయితో మోది చంపాడు. అక్కడే రాత్రంతా నిద్రించాడు. మరునాడు ఉదయం చుట్టుపక్కల వారు గమనించటంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అప్పటికే అతడు ఇల్లు వదలి పారిపోయాడు. అప్పటి నుంచి మద్యం మత్తులో వింతగా ప్రవర్తిస్తున్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దారుణాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన బండరాయితోపాటు మృతురాలి దుస్తులను సేకరించి ఆధారాలను పరిశీలించగా నేరం నిర్ధారణ అయింది. ఈ మేరకు సదరు యువకుడిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు