మరదలితో అసభ్యంగా ప్రవర్తించిన బావ అరెస్ట్‌

31 Oct, 2019 16:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మరదలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బావను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేరెడ్‌మెట్, ఓల్డ్‌ సఫిల్‌గూడకు చెందిన శ్రీనివాసులు(38) కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి మరదలి వరుసయ్యే ఓ మహిళ భర్తతో మనస్పర్థలు రావడంతో ఉత్తంనగర్‌ ప్రాంతంలో తల్లితో కలిసి ఉంటోంది. నెల రోజులుగా శ్రీనివాసులు సదరు మహిళను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బుధవారం నిందితుడిని  అరెస్ట్‌ చేశారు.  

ప్రేమను తిరస్కరించినందుకు పరువు తీశాడు
ప్రేమను తిరస్కరించిందనే కోపంతో క్లాస్‌మేట్‌ వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసి ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్లకు చెందిన మేడిశెట్టి శ్రీకాంత్‌ బాధితురాలితో పాఠశాల స్థాయి నుంచి కలిసి చదువుకున్నాడు. ఆ సమయంలో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె ఫొటోలు, ఆమె వ్యక్తిగత ఫొటోలను  తీశాడు. అయితే కొంతకాలంగా అమె బిజీగా ఉండటంతో శ్రీకాంత్‌తో మాట్లాడం మానేసింది.

తన ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో గత నెలలో వనస్థలిపురంలోని ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు. తనతో పెళ్లి చేయాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఆ తర్వాత బాధితురాలు అతడి ఫోన్‌ ఎత్తకపోవడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. గతంలో తన కెమెరాతో తీసిన పాత ఫొటోలను బయటికి తీసి తన ఫేస్‌బుక్‌ స్టేటస్‌లో పెట్టడమేగాక కామెంట్లు పెడుతూ ఆమె వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్‌ డాటా ఆధారంగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు