చూశాడని..బైక్‌ను కాల్చేశాడు..

12 Jun, 2019 07:40 IST|Sakshi

లంగర్‌హౌస్‌: తనను ఎందుకు చూశావంటూ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అటుగా వెళుతున్న వ్యక్తితో గొడవపడి అతని ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టిన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, ఎస్సై కవియుద్దీన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన మనుకుమార్‌  నగరానికి వలసవచ్చి లంగర్‌హౌస్‌ లక్ష్మీనగర్‌లో ఉంటూ కార్పెంటర్‌ పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి అతను తన కుమార్తెకు మందులు తీసుకుని వచ్చేందుకు బైక్‌పై వెళుతుండగా అదే సమయంలో హకీంపేట్‌కు చెందిన సయ్యద్‌ అమీర్‌ లక్ష్మీనగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు రాజును కలిసి తిరిగి వెళుతూ మూత్ర విసర్జన కోసం ప్రధాన రహదారి పక్కన బైక్‌ ఆపాడు.

అదే సమయంలో అటు వెళుతున్న మను కుమార్‌ అతడిని చూసి ముందుకు వెల్లాడు. దీంతో అతడిని వెంబడించిన అమీర్‌ మార్కెట్‌ రోడ్డులోని కుతుబ్‌షాహి మసీదు వద్ద మను కుమార్‌ను అడ్డుకుని తనను ఎందుకు అలా చూశాంటూ గొడవ పెట్టుకున్నాడు. అనంతరం మను బైక్‌ కీ లాక్కుని  బలవంతవంగా తన బైక్‌పై ఎక్కించుకొని రాజు ఇంటికి తీసుకెళ్లాడు. రాజు అతడికి నచ్చజెప్పి మనుకు తాళం చెవి తిరిగి ఇప్పించి పంపాడు. దీంతో మను నేరుగా తన ఇంటికి వెళ్లి ఇంటి యజమానికి విషయం చెబుతుండగా గమనించిన అమీర్‌ మసీదు వద్ద నిల»ñబెట్టిన మను బైక్‌కు నిప్పంటించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమీర్‌ వాహనంతో పాటు, రాజు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు