పెళ్లి వేడుకకు వచ్చి.. 

26 Feb, 2020 09:45 IST|Sakshi

సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్‌): బావమరిది పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వచ్చి రొడ్డు ప్రమాదంతో తీవ్రగాయలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యవకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్‌ గ్రామంలో విషాదం నింపింది. సోమవారం రాత్రి మండలంలోని సంగాయిపల్లి వద్ద మేడ్చల్‌ జిల్లా గౌడవెల్లికి చెందిన కానుగంటి నవీన్‌(29) ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొని తీవ్రగాయలకు గురికావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మడూర్‌ నుంచి గవ్వలపల్లికి స్కూటీపై వస్తున్న నవీన్‌ను ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే కొంపల్లిలోని రష్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందినట్లు పోలీస్‌లు తెలిపారు. మృతుడు నవీన్‌కు భార్య సంధ్య, 11 నెలల కుమారుడు, తల్లి ఉందని బంధువులు తెలిపారు. కేసునమోదు చేసుకుని గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు ఏఎస్‌ఐ మల్లికార్జున్‌ తెలిపారు. 

పెళ్లి వాయిదా... 
మడూర్‌ గ్రామానికి చెందిన మంగళి రామచంద్రం కుమారుడి వివాహం 26న ఉంది. నవీన్‌ రెండు రోజుల మందే భార్యపిల్లలతో మడూర్‌ చేరుకున్నాడు. సోమవారం రాత్రి గవ్వలపల్లిలో బంధువులు బస్‌ దిగడంతో తీసుకువచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. అల్లుడు చనిపోయిన విషాదంలో పెళ్లి జరపలేమని వాయిదా వేసి పందిరిని తొలగించారు. 

మరిన్ని వార్తలు