మనస్తాపంతో చెరువులో పడి యువకుడి ఆత్మహత్య
మొయినాబాద్ మండలం హిమాయత్నగర్లో ఘటన
మొయినాబాద్: ప్రేమించిన యువతి తనను అన్నయ్య అందని మనస్తాపం చెందిన ఓ యువకుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం హిమాయత్నగర్లో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామానికి చెందిన మంగలి సత్తయ్యకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు వెంకటేష్(28) గ్రామంలోనే హెయిర్ సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బంధువుల అమ్మాయి ఒకరు వెంకటేష్తో చనువుగా ఉండేది. దీంతో కొంతకాలంగా ఆమెను ప్రేమించాడు. ఇటీవల ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పాడు. తనకు ప్రేమంటే ఇష్టం లేదని.. నిన్ను అన్నలా భావించానని యువకుడికి చెప్పింది.
దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మానసికంగా కుంగిపోయిన వెంకటేష్ ఆ విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పలేదు. గురువారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలో ఉన్న గండిపేట చెరువు వద్దకు వెళ్లాడు. తన స్నేహితులకు ఫోన్చేసి ప్రేమ విషయం చెప్పి తాను చనిపోతున్నానని ఫోన్ కట్చేశాడు. స్నేహితులు చెరువు వద్దకు వెళ్లే సరికే చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు చెరువులో గాలించి అతన్ని మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు.