ఇబ్రహీంపట్నంరూరల్: తల్లి, భార్య నిత్యం గొడవలు పడుతుండటంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఆదిబట్ల ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. రాగన్నగూడలోని ఎన్ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న ఆరగంటి వెంకటయ్య కుమారుడు సుధాకర్(25) సూర్యపేట్లోని ఓ బోరుబండిపై పని చేస్తుండేవాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.
సంవత్సరం క్రితం నగరంలోని ఖాజాగూడకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా సుధాకర్ భార్యతో అతని తల్లికి నిత్యం గొడవలు అవుతుండేవి. తన తల్లితో గొడవ పెట్టుకోవద్దని సుధాకర్ తన భార్యకు చెప్పినా వినకపోవడంతో మంగళవారం సుధాకర్ బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి నేను అత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. సాయంత్రం ఎన్ఎస్ఆర్ నగర్లోని శ్మశాన వాటిక వద్దకు బైక్ పై వెళ్లి బైక్లోని పెట్రోల్ తీసి శరీరంపై పోసుకోని నిప్పంటిచుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీశారు. కుటుంబ కలహాలతో మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతుడి భార్య గర్భవతి కావడంతో సోమవారం తల్లిగారింటికి వెళ్లింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు.